తాలిబన్లతో చర్చలపై ఒమర్ అబ్దుల్లా సీరియస్
న్యూఢిల్లీ : తాలిబన్లతో మంగళవారం భారత రాయబారి చర్చలు జరపడంపై నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తాలిబన్లను ఉగ్రవాదులుగా పరిగణిస్తున్నారా లేదంటే మరింకే రకంగానైనా చూస్తున్నారా అంటూ విరుచుకుపడ్డారు. బుధవారం కశ్మీర్లో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరిపై దుమ్మెత్తి పోశారు. ”ఏదైతేనేమి, ఒక్క విషయానికి మాత్రం కచ్చితమైన సమాధానం చెప్పాలి. తాలిబన్లు ఉగ్రవాదులా, కాదా? మా అందరికీ ఈ విషయంపై భారత ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. తాలిబన్లను ఒకవేళ ఉగ్రవాదులే అయితే వారితో ఎందుకు చర్చలు జరిపారు? లేదు అనుకుంటే ఐక్యరాజ్యసమితికి వెళ్లి ఉగ్రవాద సంస్థ కాదని చెప్పగలరా? కాస్త ఆలోచించండి” అని ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు.
అఫ్ఘాన్ గడ్డపై తమకు వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా చూడాలని తాలిబాన్లకు భారత్ సూచించింది. ఆగస్టు 14న అఫ్ఘాన్పై పూర్తిస్థాయిలో పట్టు సాధించినప్పటి నుంచి తాలిబాన్లు భారత్కు అనుకూల ప్రకటనలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో తాలిబాన్ల కోరిక మేరకు ఖతార్లోని భారత రాయబారి దీపక్ మిత్తల్ వారితో భేటీ అయ్యారు. తాలిబాన్ల రాజకీయ విభాగం సీనియర్ నేత మహమ్మద్ అబ్బాస్ స్థానెక్జాయ్ ఈ భేటీలో పాల్గొన్నారు. ”అఫ్ఘానిస్థాన్లో ఉగ్రవాదానికి తావు ఉండకూడదు. అఫ్ఘాన్ గడ్డపైన భారత్కు వ్యతిరేక కార్యకలాపాలు, కుట్రలు జరగడానికి వీల్లేదు” అని మిత్తల్ తేల్చి చెప్పారు. దీనికి స్థానెక్జాయ్ స్పందిస్తూ.. అన్ని విషయాలను సానుకూలంగా స్వీకరిస్తామని, అలాంటి కార్యకలాపాలకు తావు ఉండదని హామీ ఇచ్చారు. 20 ఏళ్ల తర్వాత ఇరు దేశాల ప్రతినిధులు అధికారికంగా భేటీ అయినట్లు అఫ్ఘాన్ వర్గాలు చెబుతున్నాయి. అఫ్ఘానిస్థాన్లో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.