అమరావతి చట్టబద్ధతపై గాజువాకలో సంబరాలు అంబరాన్ని అంటాయి… పల్లా నాయకత్వంలో టిడిపి శ్రేణుల సంబరాలు
KPS డిజిటల్ మీడియా నెట్వర్క్, విశాఖపట్నం :- అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం లభించిన సందర్భంగా గాజువాకలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి, పటాకులు పేల్చుతూ, నినాదాలతో ప్రాంతం మార్మోగింది.
ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు న్యాయం చేసిన చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. ఇది కేవలం రాజధాని నిర్ణయం మాత్రమే కాకుండా, తెలుగుజాతి ఆత్మగౌరవానికి దక్కిన గౌరవమన్నారు. రైతుల త్యాగాలు, ప్రజల శాంతియుత పోరాటం ఫలితంగా ఈ విజయం సాధ్యమైందని తెలిపారు.
గత వైసీపీ పాలనలో అమరావతిని నిర్లక్ష్యం చేసి, మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని గందరగోళంలోకి నెట్టారని పల్లా గారు విమర్శించారు. రాజధాని అంశంపై ప్రజలను అయోమయంలోకి నెట్టి అభివృద్ధిని అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. ఇప్పుడు కేంద్రం స్పష్టంగా అమరావతిని చట్టబద్ధ రాజధానిగా గుర్తించడం ద్వారా అన్ని అనుమానాలకు తెరపడిందన్నారు.
ఇకపై అమరావతి అజేయమని, రాష్ట్రానికి స్పష్టమైన గుర్తింపుగా నిలుస్తుందని పల్లా గారు స్పష్టం చేశారు. రాజధాని విషయంలో అపోహలు, తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, అభివృద్ధి వ్యతిరేక శక్తుల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
అమరావతి బిల్లు ఆమోదానికి సహకరించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కృషి, కూటమి ప్రభుత్వ సంకల్పంతోనే ఈ చారిత్రాత్మక విజయం సాధ్యమైందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గాజువాకలో టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని సంబరాలు జరుపుకోవడం ప్రజల్లో అమరావతిపై ఉన్న విశ్వాసాన్ని మరోసారి స్పష్టంచేసిందని పల్లా శ్రీనివాసరావు గారు అన్నారు.

