క్రీడా వార్తలు

అసలు హీరో శార్దూల్‌ ఠాకూర్‌.. నాకంటే అతనే అర్హుడు

లండన్‌ : ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా అద్భుత విజయం వెనుక జట్టు సమిష్టి కృషి ఉందనడంలో సందేహం లేదు. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ సెంచరీకి ఎంత విలువ ఉందో.. శార్దూల్‌ ఠాకూర్‌ ట్విన్‌ హాఫ్‌ సెంచరీలకు అంతే ప్రాధాన్యం ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది. దీనిపై సోషల్‌ మీడియాలో అభిమానులు రెండుగా చీలిపోయారు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌కు రోహిత్‌ శర్మ అర్హుడని కొందరు అంటే.. లేదు శార్దూల్‌కే ఆ అర్హత ఉందని మరికొందరు వాదించారు. ప్రస్తుతం ఇది ఆసక్తికరంగా మారింది. ఈ విషయం పక్కన పెడితే రోహిత్‌ శర్మ తనకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ రావడంపై మ్యాచ్‌ అనంతరం బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్య్వూలో స్పందించాడు.

”నాలుగో టెస్టులో అసలు హీరో శార్దూల్‌ ఠాకూర్‌. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ నాకంటే శార్దూల్‌కు ఇచ్చి ఉంటే ఎక్కువగా సంతోషపడేది నేనే. తొలి ఇన్నింగ్స్‌లో తామంతా బ్యాటింగ్‌లో విఫలమైనప్పుడు శార్దూల్‌ మాత్రం మెరుపు అర్థసెంచరీతో మెరిశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ ప్రధాన బ్యాట్స్‌మెన్‌ అవుటైన తర్వాత పంత్‌తో కలిసి దాదాపు వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడమే గాక మరో హాఫ్‌ సెంచరీతో రాణించాడు. ఇక బౌలింగ్‌లోనూ తన సత్తా ఏంటో చూపించాడు.

100 పరుగుల వరకు వికెట్‌ నష్టపోకుండా పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్‌ను దెబ్బతీసి టీమిండియాకు బ్రేక్‌ ఇచ్చాడు. ఇలాంటి మొమరబుల్‌ ఇన్నింగ్స్‌ ఆడిన శార్దూల్‌కు ఇవే నా కృతజ్ఞతలు. అందుకే మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌కు నాకంటే శార్దూల్‌కే ఎక్కువ అర్హతలున్నాయి. ఏది ఏమైనా నా దృష్టిలో నేను ఈ అవార్డును శార్దూల్‌తో పంచుకున్నా. ప్రస్తుతం ఫామ్‌ దృశ్యా అందరం అద్భుతంగా ఉన్నాం.. ఇక సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లడం సంతోషంగా అనిపిస్తుంది. చివరి మ్యాచ్‌లోనూ ఇలాంటి ప్రతిభను కనబరిచి 3-1తో సిరీస్‌ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.దీనిని ఇలాగే కొనసాగిస్తాం.” అంటూ చెప్పుకొచ్చాడు.

Leave a Reply