జాతీయ వార్తలు

ఒక స్త్రీ పురుషుడు దీర్ఘకాలం కలిసివుంటే పెళ్లి జరిగినట్టే : సుప్రీంకోర్టు

ఢిల్లీ : ఒక స్త్రీ, ఒక పురుషుడు దీర్ఘకాలం కలిసివుంటే వారికి పెళ్లి జరిగినట్టేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంటే, సుధీర్ఘకాలం సహజీవనం చేస్తే వారి మధ్య బంధాన్ని వివాహ బంధంగా పరిగణిస్తుందని, దాన్ని అక్రమ సంబంధంగా భావించకూడదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పైగా, అలాంటి జంటకు పుట్టిన సంతానానికి పూర్వీకుల ఆస్తిలో వాటాను నిరాకరించరాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది.

ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, కేరళకు చెందిన ఓ జంట సుధీర్ఘకాలం పాటు సహజీవనం చేసింది. వీరికి ఓ కుమారుడు జన్మించాడు. అయితే ఈ జంట పెళ్లి చేసుకున్నట్లు ఆధారాలు లేకపోవడం వల్ల.. వారికి పుట్టిన ‘అక్రమ’ సంతానానికి పూర్వీకుల ఆస్తిలో వాటా దక్కదని కేరళ హైకోర్టు 2009లో తీర్పునిచ్చింది.

దీనిపై బాధితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌తో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ వాదనతో విభేదించింది. ‘ఒక జంట.. భార్యాభర్తల్లా దీర్ఘకాలం పాటు కలిసి సాగారంటే వారు వివాహం చేసుకున్నట్లుగానే భావించాలి. సాక్ష్యాధారాల చట్టంలోని సెక్షన్‌ 114 ఈ మేరకు సూచిస్తోంది. వారు పెళ్లి చేసుకోలేదని విస్పష్టంగా రుజువైతే తప్పించే వారి బంధాన్ని ఈ విధంగానే పరిగణించాలి’ అని పేర్కొంది.

Leave a Reply