ఆంధ్రప్రదేశ్

అమలాపురం అగ్గికి వైకాపా కార్యకర్త అన్య సాయి కారణం : మంత్రి విశ్వరూప్

అమలాపురం : కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో జరిగిన హింసాత్మక ఘటన వెనుక తమ పార్టీ కార్యకర్త అన్యం సాయి ఉన్నాడని మంత్రి విశ్వరూప్ అన్నారు. అమలాపురంలో ఆందోళనకారులు తగులబెట్టిన తన ఇంటిని ఆయన బుధవారం పరిశీలించారు. ఇంటి లోపల కలియ తిరుగుతూ కాలిపోయిన ఫర్నీచర్, ఇతర వస్తువులను పరిశీలించి ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా తనకు న్యాయం చేయాలని మంత్రిని విశ్వరూప్‌ను అద్దె ఇంటి యజమాని కోరారు.

ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్ మీడియాతో మాట్లాడుతూ, అమలాపురం అల్లర్ల వెనుక వైసీపీ కౌన్సిలర్‌ ప్రమేయం ఉందని ఆరోపించారు. అల్లర్లకు రౌడీషీటర్లను కౌన్సిలర్‌ ప్రోత్సహించారని విశ్వరూప్ తెలిపారు. ముఖ్యంగా తమ పార్టీ కార్యకర్త అన్యం సాయి పాత్ర ప్రధానంగా ఉందన్నారు.

కాగా, మంగళవారం కోనసీమ జిల్లా పేరును డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చారు. దీన్ని వ్యతిరేకిస్తూ మొదలైన ఆందోళన అనూహ్య మలుపు తిరిగింది. ‘కోనసీమ జిల్లా’ కేంద్రం అమలాపురం రణరంగాన్ని తలపించింది. బ్యాంకు కాలనీలో ఉన్న రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ ఇంటిని వందలమంది నిరసనకారులు చుట్టుముట్టారు. మంత్రి ఇంటికి నిప్పంటించారు.

అక్కడి నుంచి బయలుదేరిన ఆందోళనకారులు హౌసింగ్‌ బోర్డు కాలనీలో నివసిస్తున్న ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్‌ కుమార్‌ ఇంటిని లక్ష్యంగా చేసుకున్నారు. కింది భాగంలో ఉన్న ఆఫీసుతోపాటు ఇంటికి నిప్పంటించారు. ఎర్రవంతెన వద్ద ప్రయాణికులతో వెళుతున్న పల్లెవెలుగు, సూపర్‌ లగ్జరీ బస్సులను ధ్వంసంచేసి నిప్పుపెట్టారు. ఈ రెండు బస్సులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు గోళాలు, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. ఒకదశలో పోలీసులు కూడా నిరసనకారులపైకి రాళ్లు విసిరారు. రాళ్లదాడిలో సుమారు 20 మంది పోలీసులు గాయపడ్డారు. వారిని వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఉద్రిక్తతలు సాయంత్రం 6.30 గంటల దాకా కొనసాగాయి.

Leave a Reply