పల్లెల అభివృద్ధే లక్ష్యం…మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
KPS డిజిటల్ మీడియా నెట్వర్క్, టెక్కలి :- పల్లెల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ‘వైసీపీ ప్రభుత్వం కేవలం హామీలకే పరిమితమైంది. పల్లెల అభివృద్ధిని విస్మరించింది. సీసీ రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోయింది. ఈ నేపథ్యంలో పల్లెల అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామ’ని మంత్రి అచ్చెన్న తెలిపారు. ‘మన ఊరు- మాటామంతీ’ కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ రావివలస గ్రామస్థులకు ఇచ్చిన హామీల మేరకు వివిధ అభివృద్ధి పనులకు ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. ఒక్క రావివలస పంచాయతీలో చిన్ననారాయణపురం, దామోదరపురం, రావివలస గ్రామాలకు శ్మశానవాటికలకు రహదారులు, దోబీఘాట్, సీసీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్టులు, ఎండలమల్లిఖార్జున స్వామి ఆలయానికి రహదారులు ఇలా రూ.12కోట్ల అంచనా వ్యయంతో తొమ్మిది పనులకు శిలాఫలకాలు ప్రారంభించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్తో కలిసి ఆ ప్రాంతంలో పర్యటిస్తూ.. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. రావివలస జిల్లాపరిషత్ హైస్కూల్ ప్రహరీ పనుల జాప్యంపై సర్వశిక్ష అభియాన్ డీఈఈ రామానంద్పై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. రావివలసలో ఆర్అండ్బీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం పక్కాగా చేపట్టాలని డీఈఈ రవికాంత్కు సూచించారు. అలాగే టెక్కలి మేజర్పంచాయతీ పట్టుమహాదేవి కోనేరు అభివృద్ధికి రూ.13కోట్ల వ్యయంతో శంకుస్థాపన చేశారు. కోనేరు ప్రాంతంలో కన్సల్టెన్సీ నమూనా ప్రకారం చేపట్టాల్సిన పనులపై పంచాయతీరాజ్ డీఈఈ సుధాకర్కు దిశానిర్దేశం చేశారు. టెక్కలికి తలమానికంగా ఉండాలని స్పష్టం చేశారు. అలాగే రావివలస ఎండలమల్లిఖార్జున స్వామిని మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఆర్డీవో కృష్ణమూర్తి దర్శించుకున్నారు. ఈవో గురునాథరావు, అర్చకులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు.
రావివలస, చిన్ననారాయణపురం, దామోదరపురం గ్రామాల్లో మహిళలతో మంత్రి అచ్చెన్న మాట్లాడారు. ‘తల్లికి వందనం’ పథకం అందిందా? లేదా? అని ప్రశ్నించారు. ఒక్కో ఇంట్లో ఇద్దరు.. ముగ్గురికి చొప్పున కూడా తల్లికి వందనం డబ్బులు తమ ఖాతాల్లో జమయ్యాయని మహిళలు చెప్పారు. ఈ నెలలోనే రైతుభరోసా కూడా అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కింజరాపు ప్రసాద్, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి కణితి కిరణ్కుమార్, బగాది శేషగిరి, పినకాన అజయ్కుమార్, ఎల్ఎల్ నాయుడు, చౌదరి బాబ్జీ, బడే జగదీష్, నర్తు కృష్ణ, జనార్దన్రెడ్డి, ఇప్పిలి జగదీష్, మామిడి రాము, కామేసు, దమయంతి, సుందరమ్మ, కింగ్ పాల్గొన్నారు.