రాళ్ల దాడి చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తాం
KPS డిజిటల్ మీడియా నెట్వర్క్, అమరావతి :- మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jaganmohan Reddy) ఏపీ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా పొదిలిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలు, డ్యూటీలో ఉన్న పోలీసులపై వైసీపీ సైకోలు దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మహిళలు, పోలీసులపై రాళ్ల దాడి చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. జగన్ మోహన్ రెడ్డి మొన్న తెనాలి గంజాయి బ్యాచ్ రౌడీషీటర్లకు ఓదార్పు యాత్ర చేశారని మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.
ఇప్పుడేమో తల్లిలా గౌరవించాల్సిన మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారికి మద్దతుగా నిలుస్తున్నారంటూ మంత్రి లోకేష్ దుయ్యబట్టారు. జగన్ తన తల్లిని, చెల్లిని మెడపట్టి బయటకు గెంటేశారని, అలాగే వారిని కోర్టుకు ఈడ్చారని ఫైర్ అయ్యారు. సొంత చెల్లి పుట్టుకపై దుష్ప్రచారం చేయించిన మీరు మహిళలను గౌరవిస్తారని ఆశించడం అత్యాశలేనని లోకేష్ విమర్శించారు. మహిళలపై వైసీపీ నేతలు మాట్లాడుతున్న మాటలకు, పొదిలిలో మహిళలపై చేసిన దాడికి జగన్రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు.