ఆంధ్రప్రదేశ్

టెన్షన్‌లో తమ్మినేని

KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, శ్రీకాకుళం :- సిక్కోలు జిల్లా ఆముదాలవలస నియోజవర్గంలో ఆసక్తికరపోరు నెలకొంది. ఆ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగో సారి మామా, అల్లుడు తలపడుతున్నారు. ఆ ఇద్దరు నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో నియోజకవర్గ రాజకీయం రక్తి కడుతోంది. మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది.మరో వైపు నియోజకవర్గంలో వైసీపీ అసమ్మతి నేతలు ప్రస్తుత ఎమ్మెల్యే, స్పీకర్ తమ్మినేని సీతారాంకి వ్యతిరేకంగా రెబల్స్‌గా బరిలోకి దిగారు. సెగ్మెంట్లో కుటుంబ పాలనకు చెక్ పెడతామంటూ స్పీకర్‌కి షాక్ ఇస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఆమదాలవలస నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ పై వైసీపీ తరుపున తమ్మినేని సీతారాం గెలుపొంది ప్రస్తుతం ఏపీ శాసనసభపతిగా కొనసాగుతున్నారు. కాకుళం పార్లమెంట్ సెగ్మెంట్ టీడీపీ అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్, తమ్మినేనికి సొంత మేనల్లుడు. కూన రవికుమార్ అక్కనే తమ్మినేని సీతారాం వివాహం చేసుకున్నారు. 2024 ఎన్నికల్లోనూ వరుసగా నాలుగోసారి అముదాలవలసలో ఆ మామాఅల్లుళ్లు తలపడుతున్నారు

2009లో తమ్మినేని టిడిపిని వీడి ప్రజారాజ్యం తరఫున బరిలోకి దిగగా.. టిడిపి అభ్యర్థిగా కూన రవి కుమార్ మొదటిసారి అసెంబ్లీ బరిలో ఆయనపై పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో మామ అల్లుళ్ళు ఇద్దరు ఓటమిపాలయ్యారు. తరువాత 2014లో తమ్మినేని వైసీపీ తరఫున, కూన రవి టిడిపి తరఫున ప్రత్యక్ష పోరుకు దిగగా కూన రవి కుమార్ గెలుపొందారు. ఈ ఇరువురు నేతల మధ్య బంధుత్వం 2014 ఎన్నికల నుంచి పొలిటికల్ వైరానికి దారితీసింది.

సీనియర్ నేతైన తమ్మినేని సీతారాం ఏడుసార్లు ఆమదాలవలస అసెంబ్లీ స్థానం నుండి ఎంఎల్ఏ గా గెలుపొందారు. టిడిపి ప్రభుత్వ హయాంలో వివిధ శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. 1999 ఎన్నికల తర్వాత తమ్మినేని చాలా కాలం అసెంబ్లీ మెట్లు ఎక్కలేకపోయారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా ఓటమిని చూసిన తమ్మినేని 2019లో వైసిపి తరుపున గెలుపొంది శాసనసభ స్పీకర్ అయ్యారు. 2024 ఎన్నికల్లోనూ మామ అల్లుళ్లే ప్రధాన ప్రత్యర్ధులుగా తలపడుతుండటం ఆసక్తికరంగా మారింది. ఇద్దరు నేతల మధ్య మాటలతూటాలు పేలుతూనే ఉన్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయాలు హీటెక్కిస్తున్నారు.

తమ్మినేని సీతారాం పెద్ద అవినీతిపరుడని అంగన్వాడీ , షిప్ట్ ఆపరేటర్ పోస్టులను అమ్ముకున్నారని, అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని కూన రవి ఆరోపిస్తుoటే టీడీపి హయాంలో పురుషోత్తపురం అక్రమ ఇసుక ర్యాంప్, ఆమదాలవలస భూ ఆక్రమణ, వెన్నెలవలసలో కూనవారిపూలతోట పేరిట వంద ఎకరాల ప్రభుత్వ భూఆక్రమణకు యత్నించటం వంటి అక్రమాల మాటేంటని ఇటు తమ్మినేని కూన రవిని ప్రశ్నిస్తున్నారు. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలపైన, అభివృద్ధి పైన చర్చకు రావాలంటూ సవాళ్లు విసురుకుంటున్నారు.

వైసిపి కి విశేష ప్రజాదరణ ఉందని 2024 ఎన్నికల్లో తనకు 20వేలకు పైబడి మెజారిటీ వస్తుందని తమ్మినేని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 20వేలకు పైబడి మెజారిటీ రాకపోతే తాను ఇక ఎన్నికల్లో పోటీ చేయనంటున్నారు. అయితే తమ్మినేనికి ఆరోగ్యం క్షీణించి తనకు వచ్చే మెజారిటీని ఆయనకు వస్తుందని రివర్స్ లో చెబుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు కూన రవికుమార్. ఆమదాలవలసకు ఒక ఎమ్మెల్యే కావాలా లేక ముగ్గురు ఎమ్మెల్యే లు కావాలో నిర్ణయించుకోవాలని నియోజకవర్గ ప్రజలకు కూన రవి పిలుపునిస్తున్నారు .

తమ్మినేని గెలిస్తే అతను, అతని భార్య వాణి, అతని కుమారుడు చిరంజీవి నాగ్ అధికారం చెలాయిస్తారని మూడు కలక్షన్ సెంటర్లు ఏర్పడతాయని కూన రవి ఆరోపిస్తున్నారు. అయితే తనతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజాసేవకు అంకితవుతున్న తన కుటుంబ సభ్యులపై దుష్ర్పచారం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు తమ్మినేని పెరిగిన నిత్యావసరాల ధరలు, ప్రభుత్వ ఇసుక, మద్యం విధానాలలో డొల్లతనం, అవినీతి, పడకేసిన అభివృద్ధితో ప్రజలు విసిగివేశారారని, ఈ ఎన్నికల్లో వైసిపిని గద్దె దించేందుకు ప్రజలు రెడీగా ఉన్నారని కూన రవి తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

వారి అభివృద్ధికి మధ్యలోనే నిలిచిపోయిన శ్రీకాకుళం, ఆమదాలవలస ప్రధాన రహదారి విస్తరణ పనులే నిదర్శనమని కూన రవికుమార్ విమర్శిస్తున్నారు. ఆమదాలవలస శ్రీకాకుళం రోడ్‌కి టిడిపి హయాం లో 37 కోట్లు కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ నిధులను నాయకులు స్వాహా చేయడమే కాకుండా ఐదేళ్లు అయినా ఆ రోడ్ ని ఆలాగే వదిలేసారని కూన రవికుమార్ తమ్మినేని పై మండిపడుతున్నారు.

ఆమదాలవలస శ్రీకాకుళంరోడ్ వేయడానికి ముందుకి వచ్చిన కాంట్రక్టర్ దగ్గర స్పీకర్ తమ్మినేని సీతారాం 2 కోట్లు నొక్కేసారని తమ్మినేని సీతారాంపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆ 2 కోట్లు తోనే తన కొడుకు పెళ్లి చేశారని కూన రవికుమార్ పదేపదే టార్గెట్ చేస్తున్నారు. తమ్మినేని సీతారాం అవినీతి వలనే ఆమదాలవలస శ్రీకాకుళం రోడ్ పూర్తి కాలేదని రోడ్ పై ఇప్పటి వరకు 30 మంది చనిపోయారని కూన రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆ మామా అల్లుళ్ళ పోరులో వైసీపీ అసమ్మతి నేతలు రంగంలోకి దిగి తమ్మినేనికి షాక్ ఇస్తున్నారు. కుటుంబ పాలన వద్దు సువ్వారి గాంధీ ముద్దు అంటూ స్వతంత్ర్య అభ్యర్థిగా వైసిపి రెబల్ గాంధీ పోటీకి దిగారు. అముదాలవలస వైసీపీ టికెట్ కోసం వైసిపి నేత సువ్వారి గాంధీ, జోనల్ వైసీపీ ప్రచార విభాగం ఇంచార్జ్ చింతాడ రవికుమార్‌లు తమ్మినేనితో పోటీ పడ్డారు. దాంతో వైసీపీలో మూడు గ్రూపులు వెలిశాయి. అయితే పార్టీ అధిష్టానం టికెట్ ను తమ్మినేనికి కేటాయించడంతో వెంటనే గాంధీ, అతని భార్య మాజీ ఎంపీపీ దివ్య, అతని మరదలు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్పర్సన్ సువర్ణ పార్టీకి, పదవులకు రాజీనామా చేసేశారు. అనంతరం గాంధీ స్వతంత్ర్య అభ్యర్థిగా ఎన్నికల్లో దిగుతున్నట్లు ప్రకటించి ప్రజల్లోకి వెళ్తున్నారు.

మరోవైపు చింతాడ రవికుమార్‌ను పార్టీ పెద్దలు బుజ్జగించి తమ్మినేనికి అనుకూలంగా పనిచేసేలా ఒప్పించారు. అయితే గాంధీ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఇటు తమ్మినేని పై, అటు కూన రవిపై విమర్శనాస్త్రాలను సంధిస్తూ ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. మామా అల్లుల్లు ఇద్దరు ఒకరిపై ఒకరు బయటికి విమర్శించుకుంటున్న లోపాయికారీగా ఇద్దరి మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని సువ్వారి గాంధీ విమర్శలు గుప్పిస్తున్నారు.

కూన రవికుమార్‌కి ఆమదాలవలస టీడీపీలో ఎటువంటి వ్యతిరేకతా లేదు. కానీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై ఆ పార్టీ రెబల్ పోటీకి దిగడం ఆయనకు తలనొప్పిగా మారిందంట. మరో వైపు ఆమదాలవలస నియోజకవర్గంలో తమ్మినేని సీతారాం పై అనేక ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణా లో తన తమ్మినేని సీతారాం కోట్లు రూపాయలు వెనకేసుకున్నారనే ఆరోపణలు కూడా తమ్మినేని కి ఈ సారి ఎన్నికల్లో ఇబ్బందిపెట్టే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తుంది. ఒవైవు ఆమదాలవలస రోడ్ పూర్తి కాకపోవడం అందులో కూడా తమ్మినేని కి అవినీతి ఆరోపణలు అదే రోడ్ పై పదుల సంఖ్యలో మరణాలు ఈ సారి ఎన్నికల్లో తమ్మినేనికి నెగిటివ్‌గా మారాయని సొంత పార్టీ వాళ్లే చర్చించుకుతున్నారు.

మొత్తానికి మామ అల్లుళ్ళ పోరు ప్రజాక్షేత్రంలో కురుక్షేత్రాన్ని తలపిస్తుంది.దీంతో నియోజకవర్గ రాజకీయం రక్తి కట్టిస్తుంది. ఆమదాలవలస నియోజకవర్గానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ ఏ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుస్తాడో ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. దాంతో ఆసెంటిమెంట్ ఎవరికి వర్కౌట్ అవుతుందనే ఆసక్తి రేపుతోంది.

Leave a Reply