జగన్ రోడ్ షో అట్టర్ ఫ్లాప్?
KPS డిజిటల్ మీడియా నెట్వర్క్, ఆంధ్రప్రదేశ్ :- వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అంటున్న సీఎం జగన్ అదే వైజాగ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సొంత పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. అన్ని జిల్లాల్లో అభ్యర్ధులను పరిచయంచేస్తూ మేమంతా సిద్దం సభల్లో పాల్గొని ప్రసగిస్తూ వచ్చిన జగన్ విశాఖలో మాత్రం పరిచయకార్యక్రమాల జోలికి వెళ్లేలేదు. కనీసం ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించలేదు. కేవలంలో బస్సులో కూర్చుని చేతులు ఊపుతూ వెళ్లిపోయారు. అదే సాగరతీరంలోని వైసీపీ అభ్యర్ధుల్లో గుబులు రేపుతోందంట.
ఆంధ్రప్రదేశ్ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ విశాఖపట్నంలో నిర్వహించిన రోడ్షోతో ఆ పార్టీ నేతలు, అభ్యర్థులు నిరాశకు గురవుతున్నారంట. రోడ్షో మొత్తం నమస్కారాలు, చేతులు ఊపడంతోనే సీఎం జగన్ ముగించేశారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ముఖ్యమంత్రి రోడ్షో నిర్వహించడంతో పాటు మేమంతా సిద్ధం పేరిట ఏర్పాటుచేసిన సభల్లో పాల్గొన్నారు. ఆ జిల్లాలో పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేసి, గెలిపించాల్సిందిగా కోరారు. కానీ విశాఖలో లో అందుకు భిన్నంగా వ్యవహరించడం పార్టీ వర్గాలతోపాటు ప్రజల్లో చర్చనీయాంశమైంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం జగన్మోహన్రెడ్డి గత ఇరవై రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా విశాఖలో వేపగుంట జంక్షన్ నుంచి పీఎం పాలెం వరకూ రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎక్కడా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించలేదు. ఆయా నియోజకవర్గాల్లో రోడ్షో చేస్తున్నప్పుడు కనీసం అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థిని పరిచయం చేసే ప్రయత్నం చేయకపోవడంపై పార్టీ నేతల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. బస్సు యాత్రలో భాగంగా జగన్ ప్రతి జిల్లాలో ఏదో ఒకచోట సభలో పాల్గొన్నారు. అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేసి, వారిని పొగుడుతూ ఓట్లేయాలని విజ్ఞప్తి చేశారు.
అనకాపల్లి జిల్లాలో కూడా సభ నిర్వహించడంతోపాటు పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు. అలాంటిది ఎగ్జిక్యూటివ్ కేపిటల్ చేస్తానంటున్న విశాఖ నగరంలో మాత్రం ఎక్కడా ఒక సభ కూడా ఏర్పాటుచేయకపోవడం, నగర పరిధిలో పోటీలో ఉన్న అభ్యర్థులను కనీసం పరిచయం చేయకుండానే బస్సు యాత్రను ముగించడం పార్టీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసిందంట. జనాల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో సీఎం నిరుత్సాహానికి గురై ఉంటారని, అందుకే మొక్కుబడిగా రోడ్షో ముగించేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజా పరిణానాలు తమ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులను కలవరపాటుకు గురిచేస్తోందని వైసీపీ నేతలే పేర్కొంటున్నారు. సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిమిత్తం వస్తున్నారని తెలిసి నగర పరిధిలో ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులంతా చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రజల నుంచి సీఎం జగన్ రోడ్షోకు ఆశించిన స్థాయిలో ఆదరణ కానరాకపోవడంతో వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఆదివారం రాత్రి విశాఖలోని ఎండాడ కూడలిలో యాత్ర ముగించుకున్న జగన్ మధురవాడ ఐటీహిల్స్ సమీపంలో బస చేసేందుకు శిబిరానికి చేరుకున్నారు.
రోజంతా శిబిరంలోనే గడిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి, భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావులు జగన్ను కలిశారు. విశాఖ టూర్లో చోటు చేసుకున్న పరిణామాలపై వారితో చర్చించినట్లు తెలిసింది. ముత్తంశెట్టి బయటకు వెళ్లిపోయాక సుబ్బారెడ్డి మాత్రం 3గంటల పాటు జగన్ వద్దే ఉండటంతో వైసీపీ నేతల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మి నామినేషన్ వేయడానికి వెళ్లేముందు మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబసభ్యులతో జగన్ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. రోజంతా శిబిరంలో ఉన్న జగన్ కొద్దిమంది నాయకులనే కలవడం సుబ్బారెడ్డితో సుదీర్ఘంగా భేటీ అవ్వడం విశాఖ రోడ్ షో ఎఫెక్టే అంటున్నారు.