ఆంధ్రప్రదేశ్

కడప రాజకీయం.. వివేకా చుట్టే

KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, కడప :- ఆంధ్రప్రదేశ్‌లో వైనాట్ 175 అంటూ సింగిల్‌గా పోటీ చేస్తోంది వైసీపీ టిడిపి, బీజేపీ, జనసేన పొత్తుల ఎత్తులను ఒంటరిగా ఎదుర్కొంటున్న జగన్‌కు ఆ పోరు కంటే కుటుంబ పోరు తలనొప్పిగా తయారైందంటున్నారు. చెల్లెల్లు షర్మిల, సునీత చేస్తున్న విమర్శలతో సీఎం పరిస్థితి సెన్సిటివ్‌గా మారిందంటున్నారు. సిస్టర్స్‌పై డైరెక్ట్‌గా అటాక్ చేయలేక పార్టీ నేతలతో మాట్లాడించాల్సి వస్తుంది ఆయనకి. ఆ క్రమంలో అసలింతకీ వైయస్ కుటుంబంలో జరుగుతుంది ఆస్తుల వివాదమా? రాజకీయ ఆధిపత్యం కోసం పోరాటమా? అసలా కుటుంబంలో మిగిలిన ముఖ్య బంధువులు ఏమంటున్నారు?

వైఎస్ కుటుంబంలో మొదలైన విభేదాలు రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, సీఎం జగన్‌లను టార్గెట్ చేస్తూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, డాక్టర్ వైఎస్ సునీతలు చేస్తున్న విమర్శలు కాక రేపుతున్నాయి. కడప జిల్లాలో వైఎస్ వివేకా హత్య చుట్టూ రాజకీయం తిరుగుతూ వివేకా కుమార్తె సునీత ఎన్నికల ప్రచారంలో షర్మిలకు మద్దతు ప్రకటిస్తుండటం.. రాజకీయం వైసీపీ శ్రేణుల్లో గుబులు రేపుతున్నట్లు కనిపిస్తుంది.

వైఎస్ ఫ్యామిలీలో అన్నతమ్ములు ఒకవైపు అక్క చెల్లెళ్లు ఒకవైపు అన్నట్లు విడిపోయి చేస్తున్న రాజకీయంతో జిల్లాలో సమీకరణలు మారిపోతున్నాయి. సోదరులపై యుద్దం ప్రకటించి కడప ఎంపీ అభ్యర్ధి షర్మిల, సునీతలు న్యాయం కోసం ధర్మం కోసం అండగా ఉండాలని కొంగు పట్టి అభ్యర్ధిస్తుండటం వైఎస్ అభిమానులను ఆలోచనలో పడేస్తోందంట. ముఖ్యమంత్రి కాకముందు జగనన్న వేరు ఇప్పుడు జగనన్న వేరు అని షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఆ ఫ్యామిలీ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. వివేకా హత్యపై షర్మిల చేస్తున్న ప్రకటనలు, జగన్ పాలనపై ఆమె చేస్తున్న విమర్శలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి.

అయితే జగన్‌ని షర్మిల, సునీతలు టార్గెట్ చేస్తున్న తీరును కుటుంబసభ్యులు ఖండిస్తున్నారు. వైయస్ కుటుంబ పరువును రోడ్డున పెడుతున్నారని జగన్ మేనత్త విమలా రెడ్డి ఇటీవల షర్మిల, సునీతలపై ఫైర్ అయ్యారు. కేవలం ఆస్తులు కోసం షర్మిల అన్న జగన్ పై ఇలా చేయడం సరికాదనే వాదనను వినిపించారు విమలా రెడ్డి.ఇప్పటికే మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి సైతం ఆ అక్కచెల్లెల్లపై విమర్శలు గుప్పిస్తున్నారు.

జగన్ వ్యతిరేకుల కుట్రలో షర్మిల, సునీత పావులుగా మారారని జగన్ అనుకూల కుటుంబ సభ్యులు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారి వాదనలు తమకు అనుకూల వాతావరణం కల్పిస్తాయో? లేదో అన్న భయం వైసీపీ నేతలను వెంటాడుతూనే ఉందంట. తన చిన్నాన్న హత్య కేసులో నిందితుడైన అవినాష్‌రెడ్డిపై పోటీ చేస్తున్న షర్మిల ప్రచారంలో చూపిస్తున్న దూకుడు ఆ రేంజ్లో ఉందంటున్నారు.

జిల్లాలో వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం మొదలుపెట్టినప్పటి నుంచి పదేపదే తన చిన్నాన వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేయించింది అవినాష్ రెడ్డే అని ఆరోపిస్తున్నారు. ఆ ప్రచారానికి అడ్డుకట్ట వేయించడానికి వైసీపీకి చెందిన కడప మేయర్ సురేష్‌బాబు కడప జిల్లా కోర్టులో మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు. వివేకా హత్య ప్రస్తావన ఎత్తకూడదని కోర్టు షర్మిల, సునీతలతో పాటు ప్రతిపక్షనేతలను ఆదేశించింది. అయితే ఆ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయిస్తానంటున్నారు సునీత హత్యజరిగి అయిదేళ్లు అవుతున్నా ఇప్పటిదాకా నిందితులపై చర్యలు తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నిస్తునే ఉన్నారు.

కొద్దీ రోజుల క్రితం ప్రచారంలో భాగంగా పులివెందుల కేంద్రంగా వివేకా కుమార్తె సునీత చేసిన సవాల్ స్థానికంగా పెద్ద సంచలనమే రేపింది. అవినాష్ రెడ్డి తప్పు చేయలేదని పులివెందుల పూల అంగళ్ళ వద్ధ చర్చకు సిద్ధమా అంటూ సునీత చేసిన సవాల్‌పై మేనత్త విమలా రెడ్డి కౌంటర్ ఎటాక్ చేశారు. కుటుంబ ఆడబిడ్డలు కుటుంబ పరువును బజారున పెడుతున్నారని షర్మిల కొంగు పట్టుకొని ఓట్లు అడుక్కోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనా షర్మిల, సునీత విమర్శలను అటు బంధుగణం, ఇటు వైసీపీ నేతలు తిప్పికొడుతున్నా ఆ విమర్శల ప్రభావం అధికార పార్టీకి కొంత నష్టం కలిగిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైఎస్ అభిమానుల్లో వివేకానందరెడ్డికి ఉన్న గుడ్ విల్‌తో వైసీపీ అంతో ఇంతో డ్యామేజ్ తప్పదంటున్నారు. మరి ఈ ఫ్యామిలీ వార్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Leave a Reply