అంతర్జాతీయ విమానాలపై నిషేధం కొనసాగింపు..!
ఇంటర్నెట్డెస్క్ : కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదివారం కీలక నిర్ణయం తీసుకొంది. షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ పౌరవిమానాల రాకపోకలపై ఉన్న నిషేధాన్ని సెప్టెంబర్ 30వ తేదీ వరకూ పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్జాతీయ షెడ్యూల్ విమానాలను మార్గాలను, పరిస్థితులను బట్టి అనుమతులు మంజూరు చేస్తారు. కార్గో విమానాలు, డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతులు మంజూరు చేసిన మార్గాలకు ఈ నిషేధం వర్తించదు.
”26 జూన్ 2021 నాడు విడుదల చేసిన సర్క్యూలర్ గడువును సెప్టెంబర్ 30వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు పొడిగించారు. దీనిలో పేర్కొన్న అంతర్జాతీయ పౌర విమానాలకు ఇది వర్తిస్తుంది” అని డీజీసీఏ పేర్కొంది. ఈ నిబంధనలు అంతర్జాతీయ కార్గొ విమానాలకు వర్తించదని తెలిపింది. ఎంపిక చేసిన మార్గాల్లో షెడ్యూల్డ్ విమానాలను నడుపుతుంది.