జాతీయ వార్తలు

స్మార్ట్ ఫోన్ కోసం భార్యను అంగట్లో సరకులా అమ్మేసిన భర్త..

ఒడిశా : ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కేవలం రెండు నెలలకే అంగట్లో సరకులా అమ్మేశాడు. ఆ తర్వాత తన భార్య కనిపించడం లేదంటూ బంధువులను నమ్మించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఒడిశాలోని బెల్​పాడా పోలీస్‌స్టేషన్​ పరిధి సులేకేలా గ్రామానికి చెందిన మైనర్‌ (17) బొలంగిర్​కు చెందిన యువతితో ఫేస్‌బుక్​లో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. అనంతరం ఇరు కుటుంబాలను ఒప్పించి వారు పెళ్లి చేసుకున్నారు.

పెళ్లైన రెండు నెలల తర్వాత ఆర్థిక సమస్యలున్నాయని, ఇటుకల బట్టీలో పనిచేద్దామని చెప్పి భార్యను రాయ్​పూర్‌ తీసుకెళ్లాడు​. ఆ తర్వాత అక్కడి నుంచి రాజస్థాన్‌లోని ఓ గ్రామానికి తీసుకెళ్లాడు. అక్కడ ఓ 55 ఏళ్ల వ్యక్తి రూ.1.8 లక్షలకు భార్యను అమ్మేసి అతడి ఇంట్లో వదిలేసి వచ్చాడు.

ఆ డబ్బుతో విలాసవంతమైన హోటల్‌లో భోజనం చేసి, ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేశాడు. అనంతరం యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆమె వేరే వ్యక్తితో పారిపోయిందని నమ్మబలికాడు. అయితే, అతడిపై అనుమానం వచ్చిన బాధితురాలి కుటుంబ సభ్యులు బెల్​పాడా పోలీస్‌స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

దర్యాప్తు చేపట్టిన పోలీసులు యువతి రాజస్థాన్‌లోని ఓ గ్రామంలో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు అక్కడికి చేరుకోగా వారికి గ్రామస్థుల నుంచి తిరుగుబాటు ఎదురైంది. రోడ్లను బ్లాక్‌ చేసి వారిని అడ్డుకున్నారు. అతికష్టమ్మీద రాజస్థాన్ పోలీసుల సాయంతో ఆ యువతిని కాపాడి ఒడిశా పోలీసులు ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. పరారీలో ఉన్న వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Leave a Reply