తెలంగాణ

కొండగట్టు ఆలయానికి రూ. 600 కోట్లు : సీఎం కేసీఆర్

కరీంనగర్ : Telangana CM KCR announces Rs 600 crores for Kondagattu Anjaneya Swamy Temple development : అంజన్నా…నువ్వే దిక్కు, నీదే భారం, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మళ్లీ అధికారాన్ని కట్టబెట్టి ముచ్చటగా మూడోసారి సీఎం కుర్చీలో కూర్చోబెట్టే భారం నీదే… ఏం చేస్తావో, ఎట్ల చేస్తావో తెలీదు. నీ గుడి మాత్రం బ్రహ్మండంగా కట్టి పెడతాను. దీనిని ఒక హనుమాన్ క్షేత్రంగా తీర్చిదిద్దుతాను.

తెలంగాణలో యాదాద్రి తర్వాత రెండో అతి పెద్ద పుణ్యక్షేత్రంగా కొండగట్టు పేరు మార్మోగిపోతుంది. నీకు శతకోటి నమస్కారాలు అని కేసీఆర్ అన్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ లో కొలువుతీరిన కొండగట్టు అంజన్నపైనే ఈసారి కేసీఆర్ కొండంత ఆశలు పెట్టుకున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే ఎప్పుడూ లేనిది కొండగట్టు ఆలయానికి మొదట రూ.100 కోట్లు కేటాయిస్తామని చెప్పి, తీరా అక్కడికి వెళ్లిన తర్వాత అదనంగా మరో రూ.500 కోట్లు కేటాయించి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు.

కేసీఆర్ కి సెంటిమెంట్లు ఎక్కువేనని అందరికీ తెలిసిందే. పూజలు, యాగాలు గట్టిగా చేస్తారని అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొండగట్టు అంజన్న ఆలయాన్ని మళ్లీ కొత్తగా పునర్ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో 850ఎకరాల్లో కొండగట్టు ఆలయాభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

ఘాట్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళికలు జరగనున్నాయి. ఎటువంటి ప్రమాదాలకు తావులేకుండా సురక్షిత రహదారిగా దీనిని నిర్మించనున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోవాలో వాటన్నింటిపై చర్చించారు.

ఇంతకుముందు వేములవాడ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన కేసీఆర్, ఇప్పుడు కొండగట్టుని ప్రయార్టీలోకి తీసుకురావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జనసేన పవన్ కల్యాణ్ తన ఎన్నికల వాహనం వారాహికి ఇక్కడే పూజలు చేయడంతో ఒక్కసారి రాజకీయ నాయకుల దృష్టి అంతా అంజన్నపై పడింది.

దీనిని ముందుగా క్రెడిట్ కొట్టేసింది కేసీఆర్ అన్నమాట. అందుకే కొండగట్టు అంజన్నను కూడా కొండమీద కూర్చోబెట్టి సేవలు చేస్తున్న కేసీఆర్ మొర మరి అంజన్న ఆలకించి…ఆయన మూడుసార్ల ముచ్చట తీరుస్తాడో లేదో చూడాల్సిందే.

Leave a Reply