జాతీయ వార్తలు

ఢిల్లీలో కేంద్రీయ విద్యాలయంలో 11 యేళ్ల బాలికపై అత్యాచారం…

ఢిల్లీ : ఢిల్లీలోని ఓ కేంద్రీయ విద్యాలయంలో 11 యేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. 11, 12వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఈ దారుణానికి పాల్పడ్డారు. పొరపాటు ఈ ఇద్దరు సీనియర్లను ఆ బాలిక ఢీకొట్టడమే చేసిన నేరం. దీంతో ఆ బాలికను బలవంతంగా మరుగుదొడ్డిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం క్లాస్ టీచర్‌కు చెప్పింది. ఆమె నిందితులకు సపోర్టు చేసి.. ఈ విషయం బయట ఎక్కడా చెప్పొద్దంటూ బాధితురాలి నోరు మూయించింది. చివరకు జరిగిన ఘటన తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో ఇది వెలుగులోకి వచ్చింది.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, బాలిక తన తరగతి గదిలోకి వెళ్తుండగా పొరపాటున ఇద్దరు సీనియర్లను ఢీకొట్టింది. ఆ తర్వాత వారికి ఆమె క్షమాపణలు చెప్పింది. అయినప్పటికీ వారు వినిపించుకోకుండా బలవంతంగా టాయిలెట్‌లోకి తీసుకెళ్లి గడియపెట్టి అత్యాచారానికి పాల్పడ్డారు.

బాలిక ఈ విషయాన్ని టీచర్ దృష్టికి తీసుకెళ్లగా, నిందితులైన ఇద్దరినీ స్కూలు నుంచి బహిష్కరించామని, ఈ విషయం గురించి బయట ఎక్కడా మాట్లాడొద్దని చెప్పింది. తాజాగా, ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్.. ప్రిన్సిపాల్‌తోపాటు పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలీవల్ మాట్లాడుతూ.. స్కూల్లోనూ అమ్మాయిలకు రక్షణ లేకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందులో స్కూలు అధికారుల పాత్రపైనా విచారణ జరగాలని అన్నారు.

దీనిపై కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ప్రాంతీయ కార్యాలయం స్పందించింది. జరగిన ఘటనపై విచారణకు ఆదేశించింది. అయితే, స్కూలు వర్గాల వాదన మరోలా ఉంది. తానీ విషయాన్ని టీచర్‌కు చెప్పానని బాధిత బాలిక చెబుతుండగా, బాలిక కానీ, ఆమె తల్లిదండ్రులు కానీ తమకు ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పేర్కొంది.

Leave a Reply