రికార్డ్ కలెక్షన్స్.. ఒక్క రోజే 52.78 లక్షల మంది ప్రయాణం..
KPS డిజిటల్ నెట్వర్క్, తెలంగాణ :- సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్సులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో శనివారం ఒక్కరోజే 1,861 ప్రత్యేక బస్సులను వివిధ ప్రాంతాలకు సంస్థ నడిపించిందని వెల్లడించారు. హైదరాబాద్లో 1,127 సిటీ బస్సులను ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న కరీంనగర్, వరంగల్, ఖమ్మం,విజయవాడ, తదితర రూట్లలో తిప్పడం జరిగిందన్నారు.
సంక్రాంతి సందర్బంగా 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసేందుకు సంస్థ ప్రణాళికలు సిద్దం చేసిందని సజ్జనార్ తెలిపారు. ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉండటంతో ఈ నెల 11, 12, 13 తేదీల్లోనే 4,400 ప్రత్యేక బస్సులను నడిపించినట్లు వెల్లడించారు. శనివారం వరకు మొత్తంగా 6261 ప్రత్యేక బస్సులను నడపడం జరిగిందన్నారు. ఆదివారం కూడా 652 ప్రత్యేక బస్సులను ప్లాన్ చేయగా.. మధ్యాహ్నం వరకు 450 బస్సులను సంస్థ తిప్పిందని పేర్కొన్నారు.
శనివారం ఒక్క రోజులోనే 52.78 లక్షల మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు సిబ్బంది చేర్చారని సజ్జనార్ తెలిపారు. అందులో సగానికి పైగా మహిళా ప్రయాణికులే ఉన్నారన్నారు. మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకుని ఉచితంగా వారంతా సొంతూళ్లకు వెళ్లారన్నారు. ముందస్తు ప్రణాళిక తో పాటు సిబ్బంది సమన్వయంతో పని చేయడం వల్ల సంక్రాంతికి ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ప్రయాణికులను సొంతూళ్లకు సంస్థ చేర్చిందని సజ్జనార్ అన్నారు.
తొలి సారిగా బస్ భవన్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేశామని సజ్జనార్ తెలిపారు. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ప్రయాణికులు అందుబాటులో ఉంచామని తెలిపారు. సంక్రాంతికి ప్రశాంతంగా ప్రజలను సొంతూళ్లకు చేర్చడంలో పాలుపంచుకున్న టీఎస్ ఆర్టీసీ సిబ్బంది, అధికారులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.