సీఎం జగన్ ఢిల్లీ టూర్.. ఎజెండా ఇదేనా..?
KPS డిజిటల్ నెట్వర్క్, వెబ్ డెస్క్: ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి ఢిల్లీ పర్యటన ఆసక్తిగా మారింది. మే చివరి వారంలో జగన్ ఢిల్లీ వెళ్లారు. అప్పుడు వారంరోజుల వ్యవధిలోనే రెండుసార్లు ఢిల్లీకి వెళ్లారు. ఇప్పుడు మరోసారి హస్తినకు సీఎం జగన్ వెళ్లనున్నారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీలోని జనపథ్–1 నివాసానికి జగన్ చేరుకుంటారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుస్తారని తెలుస్తోంది. అలాగే పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై మోదీ, అమిత్ షా, కేంద్రమంత్రులతో చర్చిస్తారని సమాచారం.
మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్షాను జగన్ కలుస్తారని తెలుస్తోంది. సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో జగన్ భేటీ కానున్నారని సమాచారం. సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్తో జగన్ సమావేశమవుతారు. బుధవారం రాత్రి ఢిల్లీలోనే బస చేస్తారు. గురువారం కేంద్ర జలశక్తి మంత్రి, అందుబాటులో ఉన్న ఇతర కేంద్రమంత్రులను జగన్ కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఢిల్లీ నుంచి ఏపీకి తిరిగి వస్తారు.
రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించేందుకు సీఎం జగన్ ఢిల్లీ వెళుతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే రాజకీయ అంశాలను ప్రధానంగా చర్చిస్తారని టాక్ వినిపిస్తోంది.