కొలిక్కి వస్తున్న విశాఖ ఎమ్మార్వో రమణయ్య హత్య కేసు
KPS డిజిటల్ నెట్వర్క్, విశాఖ :- విశాఖలో సంచలనం సృష్టించిన తహసీల్దారు రమణయ్య హత్య నిందితుడు దొరికాడు. రమణ్యను హత్య చేసిన వ్యక్తిని చెన్నై ఎయిర్ పోర్ట్లో పోలీసులు పట్టుకున్నారు. మధురవాడలోని జెవెల్ పార్కు భూ వివాదమే కారణంగా హత్య చేశాడని పోలీసులు చెబుతున్నారు.
నాలుగు రోజుల క్రింత విశాఖ ను ఉలిక్కిపడేలా చేసిన ఎమ్మార్వో రమణయ్య హత్య కేసు కొలిక్కివస్తోంది. నిందితుడు గంగాధర్ను చెన్నై ఎయిర్ పోర్ట్లో పట్టుకున్నారు. మధురవాడలోని జెవెల్ పార్కు భూ వివాదమే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ పార్కు ప్లాట్లు ఉన్న స్థలానికి సంబంధించి.. కన్వేయన్స్ డీడ్ కోసం ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. దీని కోసం రమణయ్యకు నిందితుడు 57 లక్షల వరకు ఇచ్చినట్లు సమాచారం.
చెన్నైలో పట్టుబడ్డ నిందితుడు..
అయితే రమణయ్య ఇటీవల విజయనగరం జిల్లాకు బదిలీ కావడం, పాత తేదీలతో సంతకాలు పెట్టేందుకు తిరస్కరించడంతోనే కక్షగట్టి హత్య చేసినట్లు తెలుస్తోంది. విజయవాడ కు చెందిన గంగాధర్ నిందితుడని పోలీసులు శనివారమే నిర్ధారణకు వచ్చారు. విశాఖలో మర్డర్ చేశాక అతడు బెంగళూరు నుంచి చెన్నై లేదా గోవా వెళ్లి ఉంటాడని భావించి ఆ దిశగా పోలీసు బృందాలను పంపారు. సుబ్రహ్మణ్యం స్నేహితులతో అతనికి ఫోన్లు చేయించి, కూపీ లాగారు. చివరకు చెన్నై లో పట్టుకున్నారు. అతడిని ప్రస్తుతం ఎగ్మోర్ స్టేషన్లో ఉంచినట్లు తెలుస్తోంది.
వైఫల్యం మీద విచారణ…
అయితే హత్య జరగిన రోజు నిందితుడు గంగాధర్ మధ్యాహ్నం 12 వరకు వైజాగ్లోనే ఉన్నాడు. ఆ తరువాత ఫ్లైట్లో బెంగళూరు…ఆ తర్వాత చెన్నై పారిపోయాడు. నిందితుడు విమానాశ్రయంలో ఉండగా గుర్తించకపోవడం మీద సీపీ రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారంటూ అధికారుల మీద మండిపడ్డట్లు తెలుస్తోంది. ఈ వైఫల్యం మీద సీపీ ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించారు.